వ్యూహం ప్రకారం బీజేపీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోంది: సోము వీర్రాజు ఫైర్

  • వైసీపీ, కాంగ్రెస్ ల ట్రాప్ లో టీడీపీ పడింది
  • బీజేపీని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోంది
  • ఎంగిలి కాఫీలు తాగే అలవాటు బీజేపీకి లేదు
తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. మిత్రధర్మాన్ని విస్మరిస్తూ, అనైతిక చర్యలకు పాల్పడుతోందని అన్నారు. వైసీపీ, కాంగ్రెస్ లతో కలసి బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీని నాశనం చేసేందుకు టీడీపీ యత్నిస్తోందని అన్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల ట్రాప్ లో టీడీపీ పడిందని చెప్పారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు మండిపడ్డారు.

మోదీ మెడలు వంచాలంటూ టీడీపీ నేతలు అంటున్నారని... గాలేరు-నగరిని పూర్తి చేయనందుకు ఎవరి మెడలు వంచాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రజల కోసం ఎన్నో చేస్తున్న బీజేపీని నిందిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో ఆయన ప్రస్తావించిన అన్ని అభివృద్ధి పనులు బీజేపీవే అని అన్నారు. ఇప్పటికీ తాము మిత్రధర్మానికి కట్టుబడి ఉన్నామని... ఇప్పటి వరకు తాము కొన్ని విషయాల గురించే మాట్లాడామని, అన్ని విషయాల గురించే మాట్లాడే పరిస్థితే వస్తే... ఏమవుతుందో ఆలోచించండని చెప్పారు. ఎంగిలి కాఫీలు తాగే అలవాటు బీజేపీకి లేదని అన్నారు. 
Go Back to Shorts
somu veerraju
Telugudesam
YSRCP
congress
BJP

More Telugu News